ఖడ్గం నీడలో- ఎల్.టి.టి.ఇ. నాయకురాలు తమిళిని జ్ఞాపకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

In The Shadow of A Sward The Memoir of a woman Leader in the LTTE by Tamizhini.

శ్రీలంకలో ప్రత్యేక తమిళ దేశంకోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న LTTE నాయకురాలి అనుభవాలు.

తమిళిని అసలు పేరుకాదు, ఉద్యమంలో ఆమెకు పెట్టిన పేరు. 18ఏళ్ళ వయసులో ఇల్లు విడిచి, ఎల్.టి.టి.ఇ పోరాటంలో చేరినప్పుడు చంద్రిక అని పేరు పెట్టారు. తర్వాత తమిళినిగా ఉద్యమంలో అందరికీ పరిచయం.

తమిళిని స్వస్థలం విముక్తిపోరాటం జరుగుతున్న ప్రదేశంలో ఉంది. సింహళ సైన్యం అక్కడి గ్రామీణులపట్ల చూపుతున్న అమానవీయ ప్రవర్తన వల్లే తమిళిని ఇంటినుంచి వెళ్ళిపోయి విముక్తి పోరాటంలో చేరిపోయింది. అప్పటికే చెల్లెలు పోరాటంలో చేరిపోయింది. విద్యావంతుల కుటుంబం. తండ్రి లేడు, తల్లి ఆ సంసారాన్ని ఎలాగో నెట్టుకొస్తోంది, నలుగురైదుగురు పిల్లలు.

తమిళిని పద్దెనిమిదేళ్లు అనేక హోదాల్లో గెరిల్లాగా పనిచేసింది. కొన్నేళ్ళు యుద్ధరంగంలో సాయుధపోరాటం సాగించింది. ఎల్.టి.టి.ఇ లో నాయకుడి ఆజ్ఞలను అమలుచేయడం తప్ప చర్చలు ఉండవు.

ఈ జీవిత సంఘటనల గ్రంథంలో ఉద్యమం, కష్టసుఖాలే కానీ సొంత కష్టాలు, బాధలు చెప్పుకోలేదు. చెల్లెలు పోరాటంలో చనిపోయిన సంగతి తెలుసుకొని దుఃఖిస్తుంది. తల్లి ఒక సంచీ పట్టుకొని కాందిశీకులగుంపులో ఉంటే చూసి దుఃఖిస్తుంది. ఒకపర్యాయం రహస్యంగా ఇంటికి వచ్చి తల్లిని చూచి వెళుతుంది. తల్లి ఉండిపొమ్మని బ్రతిమాలుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నిర్ణయం మార్చుకుంటానేమో నన్న జంకుతో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది.

పోరాటాల్లో స్త్రీల స్థితిగతులను మాత్రం తమిళిని తనకథలో వివరంగా చిత్రించింది. 2003 లో అనేక దేశాల చొరవతో సింహళ పాలకులకు ఎల్.టి.టి.ఇ కి మధ్య చర్చలు జరిగాయి. ప్రభాకరన్ పోరాటం కొనసాగించడానికే నిర్ణయించడంతో చొరవచూపించి రాజీకి ప్రయత్నించిన దేశాలు మిన్నకుండిపోయాయి. సింహళప్రభుత్వం విమానదళంతో విముక్త ప్రాంతాలమీద దారుణంగా బాంబులు కురిపించింది. ప్రజలు, సాధారణ ఎల్.టిటి.ఇ కార్యకర్తలు వేలసంఖ్యలో చనిపోయారు, గాయపడ్డారు. 2007లో ఎల్.టి.టి.ఇ లొంగిపోయింది. తమిళిని అప్పుడు స్త్రీలరాజకీయ శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తను ఆత్మహత్య చేసుకోలేదు విషపుగుళికలు మింగి. అంతర్జాతీయ రెడ్.క్రాస్ పర్యవేక్షణలో యుద్ధఖైదీల విచారణ జరిగింది. అనేక శాఖల అధికారులు తమిళినిని విచారించి రెండేళ్ల తర్వాత రీహేబిలిటేషన్ కేంద్రానికి పంపించారు. చివరకు ఆమెను తల్లి పూచీకత్తుమీద విడిచిపెట్టారు.

తమిళిని కవయిత్రి, కథానికా రచయిత్రి. పోరాటంలో ఉన్నపుడు కూడా ఆమె ఉద్యమపత్రికలను నిర్వహించింది. తమిళిని 2015లో కాబోలు పెళ్ళిచేసుకొని, తన జీవిత కథను రాసింది. ఆమెను కేన్సర్ పట్టిపీడించినవిషయం ఆత్మీయులకు కూడా తెలియదు. 2017లో ఆమె గతించిన తర్వాతే ఈ ఆత్మకథ వెలువడింది. చెరబండరాజు కాబోలు ముంజేతిని ఖండించిన ఎత్తినపిడికిలి దింపనని, సొంత బాధలను చెప్పననీ అంటాడు. ఈమె కూడా ఈ కథనంలో ఎక్కడా సాటి మనుషుల కష్టాలు తప్ప సొంతగోడు వినిపించదు.

సింహళ ప్రభు త్వం తమిళ యుద్ధఖైదీలపట్ల, ముఖ్యంగా మహిళా ఖైదీలపట్ల నిర్దాక్షిణ్యంగా నడుచుకొంది. సైనైడ్ గుళికలు మింగి ఎందుకు ఛావకుండా లొంగిపోయిందని సాటి తమిళులు తమిళినిని దూషించారే తప్ప ఏమాత్రం సానుభూతి చూపలేదు. 18వ ఏట ఇల్లు విడిచి ఉద్యమంలోకి వెళ్ళి 18 ఏళ్ళతర్వాత యుద్ధం ముగిసి మొత్తం పోరాటవీరులతోపాటు తనూ లొంగిపోయింది. ఆ తర్వాత రెండేళ్ళు ఎన్నెన్ని జైళ్ళలో వుంచి విచారణ చేశారో? మళ్ళీ రిఫాంజైల్లో ఏడాది. ప్రకృతి కూడా తనపట్ల ఎంత క్రూరంగా వుందో! లేకపోతే ఆ యువతి కాస్తంత జీవిత సుఖాన్ని కూడా అనుభవించనీకుండా కేన్సర్ ఆమెను తీసుకొని పోయింది!

విప్లవ జీవితం పూలబాట కాదు. తమిళిని అంటుంది "విప్లవజీవితంలో సగభాగం మోటార్ సైకిల్ మీద ప్రయాణాలకే సరిపోయింద"ని.

మూలాలు 1. "In The Shadow of A Sward The Memoir of a woman Leader in the LTTE by Tamizhini." Sage Yodhapress, 2021.